నారాయణఖేడ్లో గెలుపే లక్ష్యం: రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యత మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలోని పార్టీ సీనియర్లు సునీతా లక్ష్మారెడ్డి, జె.గీతారెడ్డి, సురేశ్ షేట్కార్, టి.జయప్రకాశ్రెడ్డి వంటివారితోపాటు మండల స్థాయి నాయకులతోనూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతను ఆయనే భుజాలకెత్తుకున్నారు.
టీపీసీసీ సిట్టింగ్ స్థానమైన నారాయణఖేడ్లో దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని బరిలోకి దించింది. ఈ నియోజకవర్గంలో పార్టీ నేతల సమన్వయం, గెలుపు బాధ్యతను దామోదరకు అప్పగించింది. ఇక మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం నారాయణఖేడ్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వ్యూహంపైనా పార్టీ ముఖ్యులతో చర్చిం చారు. పార్టీ నేతల మధ్య సమన్వయంలో ఎదురైన సమస్యలనూ పరిష్కరించారు. మొత్తంగా ఖేడ్లో గెలుపు అనివార్యమనే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు.