తెలంగాణ నేతలకు రాజ్యసభ సీటు ఇవ్వం
బీజేపీ నుంచి సీటు కావాలనే ప్రతిపాదన రాలేదు: లోకేశ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం నేతలకు టికెట్టు ఇచ్చే అవకాశం లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీ నుంచి తమకో రాజ్యసభ సీటు కేటాయించాలని బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, ఆ పార్టీ నేతలకు చాలా పదవులు వస్తాయన్నారు.
రాష్ట్రపతి నామినే టెడ్ కోటాలో కూడా రాజ్యసభ సీట్లు వారికి వస్తాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే ప్రమాద బీమా అమలు చేస్తున్నామని, త్వరలో ఆరోగ్య బీమా కల్పించే యోచనలో ఉన్నామన్నారు. దీనిపై నవంబరు నాటికి స్పష్టత వస్తుందన్నారు. తాను అందరినీ కలవటం లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.