అక్కడి టీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికే
ఆ 7 మండలాలకు చెందినవారైతే ఏపీలోనే: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన ఏడు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వానికే అప్పగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఆ గ్రామాలకు చెందిన వారై ఉండి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతారన్నారు. ఆదివారం హైదరాబాద్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేఎల్పీ నేత కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పలువురు పార్టీ నేతలతో కలిసి వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడారు.
ఆ ఏడు మండలాలకు చెందిన ఉద్యోగుల ప్రతినిధులతో పాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ఢిల్లీలో తనను కలిసి.. అక్కడ పనిచేసే టీ ఉద్యోగుల అసంతృప్తిని వివరించినట్లు తెలిపారు. జోనల్ కోటా కారణంగానో, జిల్లా ప్రాతిపదికనో ఆదిలాబాద్, ఇతర తెలంగాణ జిల్లాలకు చెందిన చాలామంది ఆ మండలాల్లో పనిచేస్తున్న విషయాన్ని తెలియజేశార న్నారు.