సీఎం కేసీఆర్ ఫోన్ కోసం నిరీక్షణ
ముషీరాబాద్ (హైదరాబాద్) : బౌద్ధనగర్ డివిజన్ అంబర్నగర్కు చెందిన తిరుపతి, జయల కుమారుడు మల్లికార్జున్కు 14 ఏళ్ల వయసు. అందరు పిల్లల్లాగే ఆడుతూ, పాడుతూ సంతోషంగా బాల్యంలోని అనుభూతులను ఆస్వాదించే సమయంలో విధి వక్రించింది. ఈ ఏడాది జనవరిలో మల్లికార్జున్ గాలిపటం ఎగరేస్తూ ఎగరేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఓ చేతిని కోల్పోయాడు. ప్రమాదం జరిగిన తరువాత మల్లికార్జున్ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాడు. తరచు తల, కళ్ళు తిరుగుతుండటంతో తల్లిదండ్రులు స్కూల్కి పంపించడం మానేశారు. చీకటి పడిందంటే చాలు.. ఆ బాలుడు ఒళ్లంతా మంటలతో అల్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ శరీరాన్ని కూలర్తో చల్లబరుస్తూ ఉండాలి. అతని మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితితో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా రెండు నెలల క్రితం బౌద్ధనగర్ డివిజన్కు ప్యాట్రన్గా వచ్చారు. అంబర్నగర్కు వచ్చిన కేసీఆర్ను కలిసిన మల్లికార్జున్ తల్లిదండ్రులు పరిస్థితిని వివరించి తమ బిడ్డను ఆదుకోవాలని కోరారు. తప్పకుండా ఆదుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండు గంటల్లో ఫోన్ చేయిస్తానని వాళ్ల నంబరు కూడా తీసుకున్నారు. కానీ రెండు నెలలు గడిచిపోయినా ఎలాంటి ఫోన్కాల్ రాకపోవడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతుంది. కనీసం తన మందులకైనా సహాయం చేయాలని మల్లికార్జున్ దీనంగా వేడుకుంటున్నాడు.
సంబంధిత వార్తలు