టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్కు రంగం సిద్ధం?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఇవ్వజూపిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం కోసం ఏసీబీ కొంతకాలంగా ఆరాతీస్తున్న విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి, గోపీనాథ్ నుంచే ఆ నగదు తీసుకుని స్టీఫెన్సన్ వద్దకు వెళ్లారని ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం.
తాజా ఆధారాలతో గోపీనాథ్కు వారెంటు జారీ చేసి, నేడో, రేపో అరెస్టు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే రేవంత్రెడ్డిని అరెస్టు చేయడం, ఆయన షరతులతో కూడిన బెయిలుపై బయటికి రావడం తెలిసిందే. ఓటుకు నోటు కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న అంశంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఈ కేసును ఒక కొలిక్కి తేవాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గోపీనాథ్ రేవంత్రెడ్డికి నగదు సమకూర్చినట్టు భావిస్తున్నారు. గోపీనాథ్ను అరెస్టు చేసి విచారణ జరిపితే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు