ఎందుకు పిల్లి మొగ్గలు వేస్తున్నారు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హూదాపై టీడీపీ ఎందుకు పిల్లిమొగ్గలు వేస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై ప్రజలను సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చేసిన ప్రకటనతో ఏపీకి సంబంధం లేదని కవర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని అడ్డగోలుగా విభజించారని, విభజన గాయం మానకముందే మాట తప్పారని వాపోయారు.
ఇన్ని రకాలు ఎందుకు వ్యవహరిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కు మాత్రమే కాదని, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు. ప్రత్యేక హోదా చంద్రబాబు అడగడం లేదు, అడిగేవాళ్లను అడగనీయం లేదన్నారు. కేంద్రం ఎదుట చంద్రబాబు ఎందుకు సాగిలపడుతున్నారని నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రకటన చేయించడం లేదని అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న టీడీపీ మంత్రులు మాత్రం పెదవి విప్పడం లేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.