కేసీఆర్ కుటుంబం బందిపోట్ల ముఠా
సీఎం ఫ్యామిలీ వేల కోట్లు దోచుకుంటోంది: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఓ దొంగల పార్టీ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కుటుంబం బందిపోట్ల ముఠా, దోపిడీ దొంగల ముఠాగా మారి వేల కోట్ల రూపాయలను దోచుకుం టోందని ఆరోపించారు. పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, మల్లు రవి, టి.జగ్గారెడ్డిలతో కలసి శనివారం గాంధీ భవన్లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నేతలను విమర్శిం చేందుకు కేసీఆర్ వాడిన భాష, ఉపయో గించిన పదజాలంపై ఉత్తమ్ తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా, హూందాతనాన్ని తగ్గిం చుకునేలా ఉందన్నారు. లుచ్ఛా మాటలు, ఫాల్తూ మాటలను కేసీఆర్ ఇకనైనా మానుకుంటే మంచిదన్నారు. ‘‘మేం కూడా తెలంగాణ వాళ్లమే. కేసీఆర్ మాట్లాడిన భాష, యాస మాకూ వచ్చు. రాజకీయాల్లో హూందాతనాన్ని, పరస్పర గౌరవాలను కాపాడుకోవాలని ఓపికపట్టినం. ఇకపై కేసీఆర్ ఏ భాష మాట్లాడతారో, అదే భాషలో తగిన జవాబు చెప్తాం. ఇటుకతో మీరు కొడితే మేం రాళ్లతో కొడతాం. కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. దేశంలో ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారి ఉండరు’’ అని ఉత్తమ్ విమర్శించారు.
ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు...
తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.60 వేల కోట్ల అప్పు ఉంటే, ఈ రెండున్నరేళ్లలోనే రూ.60 వేల కోట్ల అప్పులను తెలంగాణ ప్రజలపై కేసీఆర్ మోపారని ఉత్తమ్ విమ ర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పేరుతో రూ.వేల కోట్లు అప్పులు చేసిన సీఎం కేసీఆర్... వాటిని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి వారి ద్వారా వేల కోట్ల కమీషన్లు తీసుకుని సూట్కేసుల్లో విదేశాలు దాటిస్తున్నారని ఉత్తమ్కుమార్ ఆరోపిం చారు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తిచేసిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న మిగులు విద్యుత్ను ఇస్తు న్నారన్నారు. తాము పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి సొంతంగా చేసి నట్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనమా?
దేవుళ్లకు కానుకలు ఇవ్వడంపై ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ కేసీఆర్ తన వ్యక్తిగత మొక్కుల కోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని ఉత్తమ్ నిలదీశారు. ప్రజాధనాన్ని కమీషన్ల పేరిట దిగమింగుతున్న సీఎం కేసీఆర్ కుటుంబం, ఇప్పుడేమో కుటుంబ మొక్కుల కోసం కూడా ప్రజల కష్టార్జితాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు విమా నాల్లో కుటుంబ సభ్యుల ప్రయాణానికి ప్రజాధనం ఖర్చు చేసే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ఉత్తమ్ ప్రశ్నించారు. తిరుపతి మొక్కుల కోసం ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం చట్ట వ్యతిరేకమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు.
కేసీఆర్ మోసకారి: వీహెచ్
ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం సీఎం కేసీఆర్కు అలవాటని, ఆయన పచ్చి మోసకారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని, వాళ్ల వ్యతిరేకత, నిరసనలకు సీఎం భయప డుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వా నికి సమస్యలు చెప్పి పరిష్కరిం చుకునేందుకే ధర్నాలు, నిరసనలు జరుగుతాయని, కానీ వాటికి వేదికైన ధర్నాచౌక్ను కేసీఆర్ సర్కారు ఇందిరాపార్కు నుంచి నగర శివారుకు తరలించేందుకు ప్రయత్నించడం దారు ణమన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు.