స్వైన్ఫ్లూతో మరో ఇద్దరు మృతి
హైదరాబాద్: స్వైన్ఫ్లూ తీవ్రత తగ్గినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించినప్పటికీ... ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మాత్రం ఇంకా మోగుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 1398 మందికి పరీక్షలు చేయగా, వీరిలో 556 మందికి పాజిటీవ్గా నిర్ధారణ అయింది. బాధితుల్లో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందగా, తాజాగా శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. స్వైన్ఫ్లూతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఈనెలలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. చాధర్ఘాట్కు చెందిన అబ్థుల్ మన్నన్ (26), సయ్యద్నగర్కు చెందిన గులాం హుస్సేన్ (50)లు ఈనెల 27వతేదిన నగరంలోని ప్రైవేటు ఆస్పత్రులనుంచి రిఫరల్పై గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతు శుక్రవారం మృతి చెందినట్లు ఆస్పత్రి అధికారులు ధృవీకరించారు.
ఈనెలలో గాంధీ ఆస్పత్రిలో మొత్తం 246మంది నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపగా 108 మందికి స్వైన్ఫ్లూ పాజిటివ్ వచ్చింది. కాగా ప్రస్థుతం ఐసోలేషన్వార్డులో 34మంది స్వైన్ఫ్లూ బాధితులు, మరో 29 మంది అనుమానితులకు వైద్య కిత్సలు అందిస్తున్నారు. మరో 12 మంది అనుమానిత చిన్నారులకు పిడియాట్రిక్ వార్డులో వైద్యసేవలు అందిస్తున్నారు. స్వైన్ఫ్లూ పూర్తిస్థాయిలో నయం అయిన 10మందిని శుక్రవారం డిశ్చార్జీ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ధైర్యవాన్ తెలిపారు. స్వైన్ఫ్లూ ఓపీ వార్డుతోపాటు శుక్రవారం నుంచి చిన్నారులకోసం పిడియాట్రిక్ స్వైన్ఫ్లూ అవుట్పేషెంట్ వార్డును అందుబాటులోకి తెచ్చామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ధైర్యవాన్ తెలిపారు. స్వైన్ఫ్లూ ఓపీలో 83 మందికి వైద్యసేవలు అందించామని, వీరిలో 25మంది చిన్నారులు ఉన్నారని, వీరందరికి మందులు అందించి హోం ఐసోలేషన్లో ఉంచామని ఆయన తెలిపారు.