ఎల్బీనగర్లో నలుగురు చిన్నారుల కిడ్నాప్?
ఎల్బీనగర్: ఎల్బీనగర్లో నలుగురు చిన్నారులు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న సాయినాథ్ (13), లిఖిత్ (14), సాయికుమార్, విజయ్ కుమార్ అనే విద్యార్థులు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు చిన్నారులు స్థానికంగా ఎల్బీనగర్లో ఉంటున్నారు. నిన్న (మంగళవారం) స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, తోటి విద్యార్థులు, స్నేహితులను ఆరా తీశారు. సాయినాథ్ తండ్రి మాత్రం సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చునని భావిస్తున్నట్టు తెలిపారు. తమ పిల్లవాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉంటుందనీ, మాకు ఎవరితోనూ ఎలాంటి విబేధాలు లేవని తెలిపాడు.
ఒకే ప్రాంతంలో ఉండే నలుగురు చిన్నారుల జాడ తెలియకపోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే స్కూల్ వద్ద ఎవరో రెడ్ కలర్ మారుతి వ్యాన్లో వచ్చి నలుగురు పిల్లలను ఎత్తుకెళ్లారని తోటి విద్యార్థులు చెప్పినట్టు పోలీసులకు చెప్పారు. అయితే విద్యార్థులిద్దరూ తప్పిపోయారా? లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.