‘బ్లాక్ మెయిల్కు ఆయన బ్రాండ్ అంబాసిడర్’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచిన విషయం తెలిసిందే.