డ్రంక్ అండ్ డ్రైవ్లో మళ్లీ పట్టుబడిన సినీ రచయిత

డ్రంక్ అండ్ డ్రైవ్లో మళ్లీ పట్టుబడిన సినీ రచయిత - Sakshi


సినిమా రచయిత బీవీఎస్ రవి మరోసారి మద్యం తాగుతూ వాహనం నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కోసం తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్లతో అటు నుంచి వెళ్లే వాహన చోదకులు అందరినీ తనిఖీ చేస్తుండగా, రచయిత బీవీఎస్ రవి కూడా అటుగా వెళ్తున్నారు. ఆయన పక్కనే ఆ సమయంలో వాహనంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు.



వాహనం నడుపుతున్న బీవీఎస్ రవిని పోలీసులు బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా, మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంతకుముందు కూడా ఒకసారి ఈయన మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో ఇది రెండోసారి అయ్యింది. గతంలో ఆయన పట్టుబడినప్పుడు అదే కారులో సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది. అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top