దొంగలను పట్టించిన 'లవ్ సింబల్స్'
హైదరాబాద్ : ఆటోపై ఉన్న లవ్ సింబల్స్ ముగ్గురు దొంగల 'గుర్తు'ల్ని పట్టించాయి. ఈ క్లూతోనే కేసును పోలీసులు త్వరగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే ఎర్రకుంటకి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఆజం, సయ్యద్ వసీముద్దీన్, అబ్దుల్ జావేద్ స్నేహితులు. వీరంతా కలిసి ఒకే ఆటోలో తిరుగుతూ, ఒంటరిగా తమ ఆటో ఎక్కే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతుండేవారు. ఈ నెల 20న గుంటూరు జిల్లాకు చెందిన కాశీగోపి చాంద్రాయణగుట్టలో వీరి ఆటో ఎక్కి పహడీషరీఫ్లో ఉండే తన సోదరుడి వద్దకు బయల్దేరాడు.
మధ్యలో వీరు ముగ్గురు ఆటోను దారి మళ్లించి కాశీ నుంచి రూ.500 నగదు, సెల్ ఫోన్ లాక్కొని పరరాయ్యారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానెక్కిన ఆటోపై లవ్ సింబల్స్ ఉన్నాయని పోలీసులకు క్లూ అందించాడు. ఆ దిశగా విచారణ చేసిన పోలీసులు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.