భారీ చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్


చిలకలగూడ: పద్మారావునగర్‌లో జరిగిన భారీ చోరీ కేసును చిలకలగూడ పోలీసులు చేధించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. చిలకలగూడ సీఐ కావేటి శ్రీనివాసులు, డీఎస్‌ఐ సీహెచ్ వెంకటాద్రి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సుధీర్‌సుఖ్‌దేవ్ ప్రసాద్ (68) తన భార్యతో కలిసి పద్మారావునగర్ పల్స్ ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 14న రాత్రి భారీ వర్షానికి కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటికి తాళాలు వేసి భార్యతో కలిసి శంషాబాద్‌లో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లి 16వ తేదీ ఇంటికి తిరిగివచ్చాడు. ప్రధాన ద్వారంతోపాటు గ్రిల్స్‌కు వేసిన తాళాలు పగులగొట్టి ఉండగా, లోపల అల్మారా, కప్‌బోర్డులు తెరిచి, సామాన్లు చిందరవందరగా పడిఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వారి ఇంట్లో పని చేస్తున్న నేపాల్‌కు చెందిన దినేష్‌కుమార్ (24), అతని భార్య స్వప్న (20)లు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి సుఖ్‌దేవ్ ఇంట్లో పనికి కుదిరారు.



వారి సంపదపై కన్నేసిన దినేష్ కుమార్ దంపతులు తమ బంధువులైన రత్నాకర్(30),సురేష్ (30)లను పిలిపించి ఇంటిపై రెక్కీ నిర్వహించారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, సుఖ్‌దేవ్ దంపతులు కుమార్తె ఇంటికి వెళ్లడంతో ఈనెల 15న రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి 50 తులాల బంగారు, 5 కిలోల వెండి ఆభరణాలు తీసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. కాగా చోరీ సొత్తులో కొంత ముగ్గురి వద్ద ఉంచిన రత్నాకర్ మిగిలిదంతా తనతో పాటు తీసుకెళ్లాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబైలో ఉంటున్న సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వుల్లడించాడు. ఈ సమాచారంతో నగరంలోని రామచంద్రాపురంలో ఓ ఇంట్లో పనిచేస్తున్న దినేష్‌కుమార్, స్వప్నలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 34 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రత్నాకర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top