రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


31 వరకు నామినేషన్ల స్వీకరణ



 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వి.హనుమంతరావు(కాంగ్రెస్), గుండు సుధారాణి(టీడీపీ/ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు) పదవీ కాలం జూన్ 21తో ముగుస్తుంది. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా నియమితులయ్యారు. ఆయన వివరాలు ప్రకటించారు. ఈ నెల 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వ తేదీ గడువు.



ఎన్నిక అనివార్యమైతే జూన్ 11న అసెంబ్లీలో పోలింగ్ నిర్వహిస్తారు. అయితే అధికార టీఆర్‌ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు దాదాపు లేవు. ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 40 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు. రెండు స్థానాల కోసం 80 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. కాంగ్రెస్ సహా ఏ ఇతర పక్షానికి, లేదా అన్ని విపక్షాలు కలిసినా ఒక్క సీటును కూడా గెలుచుకునే స్థాయిలో ఎమ్మెల్యేల సంఖ్య లేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్‌ఎస్‌కు రెండు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోగలిగే బలం ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top