రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
31 వరకు నామినేషన్ల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం నుంచి ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వి.హనుమంతరావు(కాంగ్రెస్), గుండు సుధారాణి(టీడీపీ/ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు) పదవీ కాలం జూన్ 21తో ముగుస్తుంది. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్వో)గా నియమితులయ్యారు. ఆయన వివరాలు ప్రకటించారు. ఈ నెల 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వ తేదీ గడువు.
ఎన్నిక అనివార్యమైతే జూన్ 11న అసెంబ్లీలో పోలింగ్ నిర్వహిస్తారు. అయితే అధికార టీఆర్ఎస్ మినహా ఏ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు దాదాపు లేవు. ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 40 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు. రెండు స్థానాల కోసం 80 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. కాంగ్రెస్ సహా ఏ ఇతర పక్షానికి, లేదా అన్ని విపక్షాలు కలిసినా ఒక్క సీటును కూడా గెలుచుకునే స్థాయిలో ఎమ్మెల్యేల సంఖ్య లేదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్ఎస్కు రెండు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోగలిగే బలం ఉంది.