రైళ్లకు కొత్త టైంటేబుల్ సిద్ధం
వివరాలు వెల్లడించిన ద.మ.రైల్వే జీఎం
ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లకు నెంబర్ల మార్పు
ఏడు రైళ్లకు వేగం పెంపు..
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లకు కొత్త టైంటేబుల్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి కొత్త వేళలను అమలు చేసే రైల్వే ఈసారి సెప్టెంబరు ఒకటి నుంచి అందుకు శ్రీకారం చుడుతోంది. ఆరు ఎక్స్ప్రెస్ రైళ్ల నెంబర్లను మార్చారు. శనివారం నడుస్తున్న కన్యాకుమారి-దిబ్రుఘర్ (15905) వివేక్ ఎక్స్ప్రెస్ను గురువారానికి మార్చారు. ఏడు రైళ్ల వేగాన్ని పెంచారు. ఏడు రైళ్లు బయలుదేరే టెర్మినళ్ల(స్టేషన్లు)ను మార్చారు. మూడు రైళ్ల మార్గాల్లో మార్పు చేర్పులు చేశారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ గురువారం వెల్లడించారు. ఆ వివరాలు..
రూటు మారిన రైళ్లు..
* సికింద్రాబాద్ మీదుగా ప్రయాణిస్తున్న తిరుపతి- హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ ఇకపై కాచిగూడ మీదుగా మాత్రమే వెళ్తుంది.
* సికింద్రాబాద్ నుంచి ప్రయాణిస్తున్న మనోహరాబాద్-సికింద్రాబాద్ డెమూ రైలు ఇకనుంచి కాచిగూడ నుంచి ప్రయాణిస్తుంది.
* గుత్తి మీదుగా ప్రయాణించే హుబ్లి- మైసూరు హంపి ఎక్స్ప్రెస్ కల్లూరు, గులపాలయం మీదుగా ప్రయాణిస్తుంది.
* వివిధ స్టేషన్లలో ఆగే రైళ్ల వేళల్లో కూడా స్వల్ప మార్పులు చేశారు. మొత్తం 58 రైళ్లకు సంబంధించి ఈ మార్పు చేశారు.
* గత ైరె ల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన 12 కొత్త రైళ్లకు గాను ఇప్పటి వరకు కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్, కాచిగూడ-నాగర్కోయిల్ వీక్లీఎక్స్ప్రెస్లు మాత్రమే పట్టాలెక్కాయి. మిగతావి ఎప్పుడు ప్రారంభమవుతాయో రైల్వే బోర్డు ప్రకటించలేదు. దీంతో వాటి వేళలను నిర్ధారించి టైంటేబుల్లో పొందుపరిచారు. అవి ప్రారంభమయ్యే తేదీలు ప్రకటించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
* రైళ్ల కొత్త టైంటేబుల్ వివరాలతో కూడిన బుక్లెట్లు అందుబాటులో ఉంచనున్నట్టు జీఎం తెలిపారు.
* గత సంవత్సరం ఖర్చుతో పోలిస్తే రూ.300 కోట్ల మేర పొదుపు చేయగా, ఆదాయంలో రూ.500 కోట్ల పెరుగదల నమోదైందన్నారు. నిర్వహణ ఖర్చును 84 శాతం నుంచి 75 శాతానికి తగ్గించామని తెలిపారు. సరుకు రవాణా కోసం అదనంగా 900 వ్యాగన్లను అందుబాటులోకి తెచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు.