రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం
మలేసియా ప్రతినిధి బృందంతో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, మౌలిక సౌకర్యాలకు సంబంధించిన రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మలేసియా అంతర్జాతీయ వ్యాపార, పరిశ్రమల మంత్రి ముస్తాఫా మహమ్మద్ నేతృత్వంలో 35 మంది ప్రతినిధుల బృం దం బుధవారం కేటీఆర్తో పాటు రాష్ట్ర వ్యాపారవేత్తలతో సమావేశమైంది. మలేసియా జనాభాలో 8 శాతం మంది భారత సంతతికి చెందిన వారేనని, ఇరు ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరంగా ముస్తాఫా అభివర్ణించారు. మరిన్ని చర్చలకు తమ దేశానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఆహ్వానించారు.