నేలపై మనుషులను గుర్తించే డ్రోన్!


ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థుల ఆవిష్కరణ



హైదరాబాద్: నిర్దేశించిన ప్రాంతంలో గాలిలో స్వతంత్రంగా ఎగురుతూనే మనుషులను, జీపీఎస్ సమాచారాన్ని కచ్చితత్వంతో గుర్తించే సరికొత్త డ్రోన్‌ను తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు ఆవిష్కరించారు. ఏరోస్పేస్ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి శోబిన్ సంతోష్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ ఆటోనామస్ కాప్టర్ మనుషుల ముఖాలను కూడా గుర్తించడం విశేషం. నేలకు దగ్గరగా, సెకనుకు 5 మీటర్ల వేగంతో ఎగురుతూ కూడా వీడియోలు సైతం తీయగలిగే ఈ మానవ రహిత గగన వాహనం(యూఏవీ) ఎలాంటి వాతావరణ పరిస్థితు లు, ప్రతికూల ప్రదేశాల్లో అయినా పనిచేస్తుంది.

 

ఫొటోలు తీయడంతో పాటు ఆ ప్రదేశాన్ని గుర్తించి జీపీఎస్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు వెంటనే సమాచారం పంపుతుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు, భద్రతా బలగాల నిఘాకు, గగనతలం నుంచి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఈ డ్రోన్ ఉపయోగపడుతుందని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. డ్రోన్‌లో పొందుపర్చిన సాఫ్ట్‌వేర్‌ను ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన అరిజిత్ రాయ్ రూ పొందించాడని, ఈ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించగా.. నేలపై ఉన్న వ్యక్తుల ముఖాలను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించి, సమాచారం పంపిందని తెలిపాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top