టెన్త్‌ ఇంగ్లిష్‌–2 పేపర్‌ లీక్‌

టెన్త్‌ ఇంగ్లిష్‌–2 పేపర్‌ లీక్‌


సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బయటకొచ్చిన ప్రశ్నపత్రం

- పోలీసుల అదుపులో తొమ్మిది మంది..



సాక్షి నెట్‌వర్క్‌/హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల్లో లీకేజీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంగ్లిష్‌–1 పేపర్‌ లీక్‌ కాగా.. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఇంగ్లిష్‌–2 ప్రశ్నపత్నం లీకైంది! ఇందుకు బాధ్యులైన ముగ్గురిని అధికారులను సస్పెండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌లోని విజయ విద్యామందిర్‌ పాఠశాలలో ఈ లీకేజీ వ్యవహారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం లాలితండాకు చెందిన బానోతు ప్రసాద్‌ తన తమ్ముడైన బాబు పరీక్ష రాస్తున్న గది వెనుక భాగాన నక్కి కూర్చున్నాడు. హాల్‌ చివరి వరుసలో కూర్చొని పరీక్ష రాస్తున్న తమ్ముడి చేతిలోని ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం విజ్ఞాన్, తనూజ తదితర పాఠశాలలకు వాట్సాప్‌ ద్వారా చేరవేశాడు.



తనూజ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు షేక్‌ ఖలీల్‌తోపాటు ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు విద్యార్థులతో కలసి ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబు పత్రాలను తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. తనూజ స్కూల్‌పై దాడి చేసి జవాబు పత్రాలు తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్‌ అయిన ముగ్గురు అధికారులతో పాటు ఆరుగురు టీచర్లు చిచ్చుల శరత్, భూక్యా ఆంజనేయులు, ఎస్‌కె. ఖలీల్‌ బాబు, పోలె వెంకటేశ్వర్లు, శ్రీను, బానోతు ప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



దంతాలపల్లి నుంచే ఇంగ్లిష్‌–1 లీక్‌

పదో తరగతి ఇంగ్లిష్‌–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి కేంద్రంగా వాట్సాప్‌ ద్వారా ఈ పేపర్‌ బయటకు వచ్చినట్లు బుధవారం పోలీసుల విచారణలో తేలింది. ఖమ్మం జిల్లాలో ఇంగ్లిష్‌ పేపర్‌–1 లీకైనట్టు ఆరోపణలు రావడంతో జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మీబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత వరంగల్‌ కేంద్రంగా ప్రశ్నపత్రం లీకైనట్లు పోలీసులు వెల్లడించినా... తర్వాత మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి కేంద్రంగా లీక్‌ జరిగినట్టు తేల్చారు. పశ్నపత్రం దంతాలపల్లి హైస్కూల్‌ ఉపాధ్యాయుడు కస్తూరి సతీశ్‌ ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లినట్లు తేలింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట శివారులోని శివాని హైస్కూల్‌ నుంచి ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు పేపర్‌ చేరిందని ప్రాథమికంగా గుర్తించారు.



మంగళవారం రాత్రే పోలీసులు దంతాలపల్లి హైస్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం దంతాలపల్లికి వచ్చిన పోలీసులు.. పదో తరగతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వరిస్తున్న అక్కిరెడ్డి వెంకట్‌రెడ్డిని, జెడ్పీఎస్‌ పాఠశాల బయాలజీ టీచర్‌ ఎల్లు హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సతీశ్‌ సతీమణి సింధూజ గతంలో వర్ధన్నపేటలోని శివాని స్కూల్‌లో టీచర్‌గా పని చేసినట్లు సమాచారం. ఈ లీకేజీ వ్యవహారంలో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీశ్‌ ఇన్విజిలేషన్‌ డ్యూటీ చేయకపోయినప్పటికీ.. ఇన్విజిలేషన్‌ విధుల్లో ఉన్న వెంకట్‌రెడ్డి ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటికి తెప్పించినట్లు సమాచారం.



అధిక గ్రేడ్‌లు పొందేందుకే..

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలోని శివాని టెక్నో స్కూల్‌ యజమాన్యం... ప్రభుత్వ టీచర్లయిన కస్తూరి సతీశ్, హర్షవర్ధన్‌రెడ్డి, అక్కిరెడ్డి వెంకటరెడ్డిల సహకారంతో అధిక గ్రేడ్‌లు పొందేందుకు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు ఖమ్మం ఏసీపీ గణేశ్‌ వెల్లడించారు. బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఏ–1గా ఖమ్మంకు చెందిన రామలింగ స్వామి, ఏ–2, 3లుగా వర్థన్నపేటకు చెందిన జీవంజీ నాగరవిప్రసాద్, కమ్మకోని రాజ్‌కుమార్, ఏ–4, 5, 6లుగా కస్తూరి సతీశ్‌కుమార్, హర్షవర్థన్‌రెడ్డి, అక్కిరెడ్డి వెంకటరెడ్డిలు ఉన్నారు.



ప్రైవేటు యాజమాన్యాలతో కుమ్మక్కై..

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో పరీక్ష నిర్వహణ సిబ్బంది కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవు తోంది. డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు కూడా సెల్‌ఫోన్లను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్ల వద్దని నిబం ధన విధించినా.. ఇన్విజిలేషన్‌ డ్యూటీలో ఉన్న సిబ్బంది మాత్రం రహస్యంగా సెల్‌ ఫోన్లను తీసుకెళ్తున్నారు. పరీక్షలు ప్రారం భమైన కొద్దినిమిసాల్లో ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి సోషల్‌ మీడియా ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇందుకు ప్రైవేట్‌ యాజమాన్యాల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top