తెలంగాణ టీడీపీలో ‘మెట్రో’ చిచ్చు!

తెలంగాణ టీడీపీలో ‘మెట్రో’ చిచ్చు!


* ఇప్పుడప్పుడే దానిపై గొడవ వద్దన్న ఎర్రబెల్లి  

* చాన్స్ దొరికినప్పుడు వదలొద్దన్న పలువురు నేతలు

* రేవంత్‌కు బాబు మద్దతు.. ఇరుకునపడిన ఎర్రబెల్లి!


 

సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేసు ్తన్న పోరాటం ఆ పార్టీలో అంతర్గతంగా భగ్గుమంటోంది. మెట్రో రైలు వివాదంపై పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వాది స్తుండగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి దీన్ని ఆయుధంగా వాడుకోవాలని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పోరాడాల్సిం దేనని.. ఎవరికైనా అభ్యంతరాలుంటే పార్టీని విడిచిపెట్టిపోవచ్చునని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో బుధవారం జరిగిన సమావేశం నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు అలిగి వెళ్లిపోయారు.

 

సెప్టెంబర్ 17న టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమానికి చంద్రబాబుతోపాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమ ణ, ముఖ్య నేతలు ఎర్రబెల్లి, రేవంత్, రమేశ్ రాథోడ్, ఎం.వివేకానంద, కృష్ణయాదవ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యా రు. హైదరాబాద్ మెట్రో రైలు అంశంపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ‘మెట్రో రైలు విషయం లో ఇప్పుడే అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. దీంతో ఒక సామాజిక వర్గం పార్టీకి దూరమవుతుంది.

 

ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు చేస్తే ప్రజలు అర్థం చేసుకోరు. కొంతకాలం ఆగిన తర్వాత పోరాడుదాం’ అని వాదిం చినట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్, వివేక్‌లు స్పందిస్తూ ‘గత ప్రభుత్వాలపై పోరాడిన సందర్భంగా ఎవరిది, ఏ సామాజిక వర్గం అని చూసి ఆగినమా? అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు కులాలు, మతాలు చూస్తామా? ’’ అని వాదించారు.

 

దీనిపై చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని ‘‘తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండాలి. ఏమీ చేయకుండా ఉంటే తెలంగాణలో ఉన్న పార్టీ కూడా పోతుంది. హైదరాబాద్ మెట్రో రైలుపై ప్రజా క్షేత్రంలోనూ, శాసనసభలోనూ పోరాడండి. ఏమాత్రం వెనుకాడొద్దు. ఈ విషయంలో రేవంత్‌ను అందరూ అనుసరించండి. దీనిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే పార్టీలో ఉండాలా? వద్దా? అనేది వారే నిర్ణయం తీసుకోవాలి’’ అని బాబు స్పష్టం చేశారు. బాబు కూడా వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆ సమావేశం నుండి ఎర్రబెల్లి దయాకర్‌రావు అలిగి వెళ్లిపోయారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top