గుంటూరులో తెలంగాణ ఫార్మసీ రిజిస్ట్రేషన్లు
ఇక్కడ మూడు రోజుల రిజిస్ట్రేషన్ నిబంధనకు స్వస్తితో ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేక ఫార్మసీ కౌన్సిల్ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంతో తెలంగాణ ఫార్మసీ రిజిస్ట్రేషన్లు ఏపీలోని గుంటూరులో చేయించుకోవాల్సి వస్తోంది. వారంలో 3 రోజులు హైదరాబాద్లో రిజిస్ట్రేషన్లకు మొదట్లో అంగీకరించిన ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అధికారులు ఇక్కడికి రావడం లేదు. దీంతో తెలంగాణలో రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం గుంటూరుకు వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి ఫార్మసీ కౌన్సిల్లో ఉద్యోగులు, ఫైళ్ల విభజన ఇప్పటికీ జరగలేదు. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ను 4 నెలల కిందట గుంటూరుకు తరలిం చడంతో రాష్ట్ర విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. ఫార్మసీ విద్యార్థుల రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ స్థాపించి పది నెలలు గడిచినా ఇంకా సొంత కార్యాలయం లేదు. ఈ ట్రిబ్యునల్ రిజిస్ట్రార్గా అకున్ సబర్వాల్ను అప్పట్లో ప్రభుత్వం నియ మించింది.
తెలంగాణలో కొనసాగాలనుకునే ఫార్మసిస్టులంతా రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అప్పట్లో ట్రిబ్యునల్ ప్రకటిం చింది. దీంతో తెలంగాణలో 25 వేల మందికిపైగా ఫార్మసిస్టులు తమ వివ రాలను నమోదు చేసుకున్నారు. అకున్సబర్వాల్ బదిలీతో రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా ఉండడంతో∙జాప్యం జరుగుతోంది. అదే సమయంలో ఫార్మసీ కౌన్సిల్ కార్యవర్గ ఎన్నికలను.. నమోదు చేసుకున్న ఫార్మసిస్టులతో నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఫార్మసీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.