తెలంగాణ న్యాయవాదులు బెదిరిస్తున్నారు
ఏసీజేకు ఏపీ న్యాయాధికారుల సంఘం వినతి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులకు ఆప్షన్లు ఇచ్చిన తమను తెలంగాణ న్యాయవాదులు బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం నేతలు గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు ఫిర్యాదు చేశారు. తెలంగాణకు ఇచ్చిన ఆప్షన్లు ఉపసంహరించుకోవాలంటూ న్యాయవాదులు తమ ఛాంబర్లలోకి చొరబడి బెదిరిస్తున్నారన్నారు.
ఈ మేరకు సంఘం అధ్యక్షుడు, మాజీ న్యాయాధికారి డి.ధర్మారావు, ప్రధాన కార్యదర్శి వి.జయసూర్య, ఉపాధ్యక్షుడు గంటా శ్రీనివాస్ తదితరులు ఏసీజేకు వినతిపత్రం సమర్పించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారన్నారు. పునర్విభజన చట్టంలో స్థానికత ఆధారంగా కేటాయింపులు చేపట్టాలని ఎక్కడ లేదన్నారు. ఏపీ న్యాయాధికారుల్లో విశ్వాసం కలిగించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వారు ఏసీజేను అభ్యర్థించారు.