2న తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సచివాలయంలో ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ జరగనున్నట్లు సమాచారం. సెప్టెంబరు రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే, ఓ సారి జూలైలో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చతో పాటు, ప్రభుత్వం తీసుకోవాల్సిన మరికొన్ని నిర్ణయాలపైనా చర్చ ఉంటుందని సమాచారం.
సెప్టెంబరు తొలి వారంలో సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానం మేరకు చైనా వెళ్తున్న సీఎం 8వ తేదీ నుంచి 16 వరకు అక్కడ పర్యటిస్తారు. సీఎం తిరిగి వచ్చాక వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉన్నందున ముందుగానే కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.