కేసీఆర్కు టీడీపీ నేత ఎల్.రమణ లేఖ
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేత ఎల్.రమణ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. మేడారం జాతర సందర్భంగా ఈ నెల 18,19,20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం జాతరకు కోట్లలో భక్తులు తరలి వెళ్తారు. ఈ నెల 17 నుంచి నాలుగురోజులపాటు జరిగే మేడారం జాతర ఏర్పాట్లు దాదాపు పూర్తయాయి.
ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వరంగల్ జిల్లా మేడారానికి భక్తజనం క్యూ కడతారు. జాతర మొదలు కాకముందు నుంచే శని, ఆదివారాల్లో లక్షల్లో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈనెల 14 నుంచి ఆ సంఖ్య ఎక్కువ కానుంది. ఇక 17, 18 తేదీల్లో అది మరింతగా పెరుగునుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్.రమణ మూడు రోజులు సెలవులు ఇవ్వాలని తన లేఖలో కోరారు.