‘టార్గెట్ చొప్పదండి’ ఎలా సాధ్యమైంది?

‘టార్గెట్ చొప్పదండి’ ఎలా సాధ్యమైంది? - Sakshi


స్థానిక సహకారం లేకుండా ఆపరేషన్ అసాధ్యం

 

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని, జమాత్ అల్  ముజాహిదీన్ పేరుతో కొత్త ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన ముష్కరులకు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకును టార్గెట్ చేయడం ఎలా సాధ్యమైంది..? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం ఇదే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. స్థానిక సహకారం లేకుండా అంత పక్కాగా దోపిడీ ఆపరేషన్ చేపట్టడం సాధ్యం కాదనే కోణంలో ఆరా తీస్తోంది. కరీంనగర్‌లో గతంలోనూ ఉగ్రవాద ఛాయలు ఉండటంతో వారి అనుచరులు, సానుభూతిపరులపై కూపీ లాగుతోంది. మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.నాలుగు కోట్ల విలువైన సొత్తు, నగదు దుండగులు ఎత్తుకుపోయారు. ఈ కేసూ ఇప్పటివరకు కొలిక్కిరాకపోవడంతో ఉగ్రవాదుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



 పక్కా రెక్కీ తరవాతే దోపిడీ...



కరీంనగర్ జిల్లాలో ఏడో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న చొప్పదండిలో జరిగిన ఎస్‌బీఐ బ్యాంకు దోపిడీకి ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక ప్రకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న తుపాకులతో వచ్చిన నలుగురు ముష్కరులు బ్యాంకు పని చేయడం ప్రారంభించడానికి ముందే లోపలకు ప్రవేశించారు. అప్పటినుంచి ఉదయం 9.30 గంటల వరకు ఖాతాదారులతో సహా వచ్చిన వారందరినీ ఓ గదిలో బంధించారు. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు తుపాకులు గురిపెట్టి లాకర్‌ను తెరిపించారు. అందులో ఉన్న రూ.46 లక్షల నగదు బ్యాగుల్లో సర్దుకుని ముందే సిద్ధంగా ఉంచుకున్న రెండు ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. దీనికోసం స్థానికంగా కొందరి సహకారంతో ఏదో ఒక ప్రాంతంలో బస చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దోపిడీకి సహకరించిన వారిని కనిపెట్టడంపై దృష్టి కేంద్రీకరించారు. మరోవైపు బుర్ధ్వాన్ కుట్రలో పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణమైన శారదా గ్రూప్ స్కామ్ నగదు సైతం వినియోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలను సేకరించింది. దీంతో బుర్ధ్వాన్ కుట్ర కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు, నిఘా వర్గాలు ప్రధానంగా పశ్చిమబెంగాల్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఉన్న అక్రమ మదర్సాలపై దృష్టి పెట్టాయి. వీటిలో కొన్నింటిని జమాత్ అల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు బాంబు ఫ్యాక్టరీలుగా వినియోగించుకునే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి.



తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పశ్చిమ బెంగాల్, బీహార్‌ల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనసమర్థ ప్రాంతాలతో పాటు విమానాశ్రయాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సూచించడంతో పోలీసు వర్గాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

 బాంబులు బంగ్లాదేశ్ పంపేందుకే: ఎన్‌ఐఏ

 జమాత్ అల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు బుర్ధ్వాన్‌లో తయారు చేస్తున్న బాంబులు బంగ్లాదేశ్‌కు రవాణా చేసేందుకేనని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురిలో ఇద్దరు మహిళలు జ్యుడీషియల్ కస్టడీలో, అబ్దుల్ హకీం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపింది. నాలుగో నిందితుడు బద్రే ఆలంను ఆర్థిక సహకారం సహా వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొంది. బుర్ధ్వాన్‌లోని పేలుడు స్థలాన్ని ఎన్‌ఐఏ డీజీ శరద్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసి, వీరిపై రివార్డు సైతం ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

 

ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా



హైదరాబాద్: రాష్ట్రంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల, స్వదేశీ ఉగ్రవాదుల కార్యకలాపాలైపై  ఇంటెలిజెన్స్ అధికారులతో  రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ శుక్రవారం సమీక్ష జరిపారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని బ్యాంకు నుంచి గత పిబ్రవరిలో రూ.46 లక్షల దోపిడీ ఘటనను డీజీపీ తీవ్రంగా పరిగణించారు.  జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్‌ఐఎ) జరిపిన  విచారణలో  దోపిడీకి పాల్పడింది ఫైజల్ ముఠాగా తేలింది. దోపిడి సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుతున్నారని తెలిసింది. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఒక ప్రముఖ ఐటీ కంపెనీ  దిల్‌షుక్‌నగర్ పేలుళ్లతో వెనుకకు వెళ్లిపోయిందంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో గుర్తు చేసిన సీఎం కేసీఆర్.. మళ్లీ ఇలాంటివి పునరావృతం  కారాదన్నారు.  చొప్పదండి ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో సిమి  కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు తెలిసింది.       

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top