బీజేపీ పాలనలో పేదల బతుకు ఛిద్రం
‘మీట్ది ప్రెస్’లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తన మూడేళ్ల పాలనలో దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో విధ్వంసాన్ని సృష్టించిందని, ఫలితంగా పేదలు, రైతులతోపాటు వివిధ రంగాల కార్మికుల బతుకులు ఛిద్రమైపోయాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో సురవరం పాల్గొన్నారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధానకార్యదర్శి ఎస్.విజయ్కుమార్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. సురవరం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా హడావుడి చేస్తుండగా, అదేబాటలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ పయనిస్తున్నారన్నారు.
ఇటీవల అమిత్షా నల్లగొండ జిల్లాలో మూడురోజు లున్నారని, ఆయన 30రోజులున్నా కమ్యూనిస్టుల కంచుకోటలను బద్ధలు కొట్టలేరన్నారు. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైం దన్నారు. కేసీఆర్ మూడేళ్ల పాలన వాగాడంబ రంగానూ, గత పోరాటాలపై ఆధారపడి బతుకీడుస్తున్నట్లుగానూ ఉందని ఎద్దేవా చేశారు. కార్మిక, తదితర చట్టాల్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు దేశంపై పెనుప్రభావాన్ని చూపనున్నాయన్నారు. ఎన్నికలకు ముందు పేదలను ఉద్ధరిస్తామని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత పెద్దోళ్లకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హిందీ, హిందుత్వ అసలు ఎజెండా...
హిందీ, హిందూ, హిందుత్వ అనేది బీజేపీ అసలు ఎజెండా అని, సంఘ్పరివార్ అదుపాజ్ఞల్లోని ఆ పార్టీ హిందీని, ప్రజల జీవితాలతో సంబంధం లేని సంస్కృత భాషను దేశప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోం దని సురవరం విమర్శించారు. ఇది దేశంలో అనేక దుష్పరిణామాలకు దారితీసి, జాతీయ సమైక్యతను దెబ్బతీసి భాషల మధ్య యుద్ధ వాతావరణానికి పురికొల్పుతుందని ఆందోళ నను వ్యక్తంచేశారు.
దేశంలో సెక్యులరిజాన్ని పరిరక్షించే వ్యక్తే రాష్ట్రపతిగా ఉండాలని, ఈ దిశలో గోపాలకృష్ణ గాంధీతో వామపక్షాలు సంప్రదింపులు జరుపుతున్న విషయం వాస్త వమేనని ఒక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. దేశంలోని కొందరు రాజకీయ నాయకులను, విపక్షాలను లోబరుచుకునేందుకే సీబీఐ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా కేంద్రం పథకం ప్రకారం దాడులకు పాల్పడుతోందని ఆరో పించారు. గతంలో బీజేపీ నాయకులు ఆరెస్సెస్ సేవకులమని చెప్పుకోడానికి సిగ్గు పడేవారని, ఇప్పుడైతే ఏకంగా కేంద్ర మంత్రులకు సంఘ్పరివార్ కార్యాలయం లోనే కరసేవకులు దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు.