రూ.2 కోట్లు ఇస్తావా.. చస్తావా..?
హైదరాబాద్: శుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వైస్ చైర్మన్ కల్యాణ చక్రవర్తికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గత వారం రోజులుగా ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రూ.2 కోట్లు ఇవ్వకపోతే కిడ్నాప్ చేసి హత్య చేస్తానంటూ ఫోన్లో బెదిరించడంతో ఆందోళన చెందాడు. ఆ వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కల్యాణ చక్రవర్తి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని లుంబినిమాల్ నాల్గవ అంతస్తులోని శుభగృహ ప్రాజెక్ట్స్ భవన నిర్మాణ సంస్థకు కల్యాణ చక్రవర్తి వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా మణికొండకు చెందిన శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అతడికి ఫోన్ చేస్తూ రూ.2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే హత్య చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో తనకు శ్రీనివాస్ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోకాపేటలో ఓ భూ వివాదానికి సంబంధించి ఈ బెదిరింపులు వస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు