విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ-సికింద్రాబాద్ (07207) స్పెషల్ ట్రైన్ జూలై 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విజయవాడ (07208) స్పెషల్ జూలై 10, 17, 24 తేదీలలో రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 కు విజయవాడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ (07011/07012) ప్రత్యేక రైలు జూలై 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 7.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15 కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జూలై 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 6.10 కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
అదనపు బెర్తులు..: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేలోని పలు రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు. జూలై నెలలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా ఈ అదనపు బెర్తు/సీటు సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నాందేడ్-పుణే, నాందేడ్-ముంబై, సికింద్రాబాద్-విజయవాడ, తిరుపతి-హైదరాబాద్, సికింద్రాబాద్-రాజ్కోట్, సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-త్రివేండ్రం తదితర మార్గాల్లో నడిచే రైళ్లలో ఈ అదనపు సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
జన్మభూమికి నూజివీడులో హాల్ట్: సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్కు ఈ నెల 7 నుంచి నూజివీడులో హాల్ట్ సదుపాయం కల్పించనున్నారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు మధ్యాహ్నం 2.13 గంటలకు, విశాఖ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఉదయం 10.44 గంటలకు ఒక నిమిషం పాటు నూజివీడులో రైలు ఆగుతుంది.