రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి




 బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని మజీదు చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజ్‌గిరి నేరేడ్‌మెట్ దినకర్‌నగర్‌లో నివసించే జి. సందీప్‌లాల్(35) మాదాపూర్ అయ్యప్ప సొసైటీ శ్రీవాణి ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు డ్యూటీకి వెళ్లారు. విధులు ముగించుకొని మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటల ప్రాంతంలో కార్యాలయం నుంచి బయల్దేరి బైక్‌పై ఏపీ 29 ఏక్యూ 5873పై తన స్నేహితుడు శివను కూర్చుండబెట్టుకొని రోడ్ నెం. 3 మీదుగా వెళ్తుండగా టీవీ 9 సమీపంలో మజీదు చౌరస్తా వెనుక నుంచి వచ్చిన స్విఫ్ట్‌కారు ఢీకొని కుప్పకూలాడు.



 ఈ ప్రమాదంలో సందీప్ లాల్ అక్కడికక్కడే మృతి చెందగా, శివకు తీవ్ర గాయాలుకాగా చికిత్సనిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని సందీప్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారు కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



 

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top