అబద్ధాల్లో మోదీ, కేసీఆర్‌ ఇద్దరూఇద్దరే

అబద్ధాల్లో మోదీ, కేసీఆర్‌ ఇద్దరూఇద్దరే - Sakshi


ఏఐసీసీ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌

సాక్షి, హైదరాబాద్‌:
అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఇద్దరేనని ఏఐసీసీ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌ విమర్శించారు. పార్టీ నేతలతో కలసి సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మోదీ మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు.


రైతులపై దాడులు, గోరక్ష పేరుతో అమాయకులను పొట్టన పెట్టుకోవడం వంటి కిరాతక చర్యలకు హద్దులేకుండా పోయిందన్నారు. ముస్లిం మహిళలకు సంబంధించిన తలాఖ్‌ గురించి మాట్లాడుతున్న మోదీ, తన వ్యక్తిగత జీవితంలో భార్య గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మోదీ పాలన కారణంగా విదేశీ పెట్టుబడులు రావడంలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలను కూలదోయడం, ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే మోదీ పనిగా పెట్టుకున్నారన్నారు. అవినీతి గురించి మాట్లాడుతున్న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తన అవినీతిని ఎందుకు చెప్పుకోవడంలేదని ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top