ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు
ఇదీ పరారీలో ఉన్న సాయికుమార్ చరిత్ర
బంజారాహిల్స్: జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం దొంగ అవతారం ఎత్తిన గడ్డమీది సాయికుమార్(32) ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని నిత్యపెళ్లి కొడుకుగా చలామణి అవుతున్నాడు. వారం క్రితం బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని సాగర్ సొసైటీలో గుంటూరుకు చెందిన డిస్ట్రిబ్యూటర్ వాసుదేవరావుచౌదరి కళ్లుగప్పి కారులో ఉన్న రూ. 21 లక్షలు తీసుకొని ఉడాయించిన సాయికుమార్ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలిస్తూ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఈ విచారణలో పోలీసులు అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూశాయి. 32 ఏళ్ల వయసులోనే సాయికుమార్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది.
ప్రస్తుతం ఉన్న 4వ భార్య మంజులను ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నల్లగొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన సాయికుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జీడిమెట్ల గిర్ని ఏరియాలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. డ్రైవర్గా చేరి యజమాని నమ్మకాన్ని చూరగొంటాడు. నాలుగైదు నెల లు గడిచాక యజమానికి టోకరా వేసి నగదుతో ఉడాయిస్తుంటాడు.
పదేళ్లుగా సాయికుమార్ నేరాలకు పాల్పడుతున్నాడు. సాయికుమార్ ఎంతో నమ్మకస్థుడిగా ఉండేవాడని, రూ. 21 లక్షలతో పరారయ్యాడంటే నమ్మబుద్ధి కావడం లేదని డిస్ట్రిబ్యూటర్ వాసుదేవరావు పోలీసులకు తెలిపా రు. రెండుమూడేళ్ల కోసారి భార్యలను మారుస్తూ తాను పని చేసే స్థలంలోనూ పట్టుమని ఏడాది కూడా ఉండకపోవడం ఈ నిత్యపెళ్లికొడుకి నైజమని పోలీసులు చెప్పారు.