సమస్యలను దాచిపెట్టి ఉత్సవాలా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్: వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఉస్మానియా యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాల పేరుతో సమస్యలను దాచిపెడుతున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. సమస్యలు పరిష్కరించకుండా ఉత్సవాలంటూ ఆడంబరాలకు పోవడం వల్ల విద్యార్థులకు ఒరిగేదేమిటని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
ఆంధ్రా పాలకుల హయాంలో గ్రేడ్–1 యూనివర్సిటీగా ఉన్న ఓయూకు ఇప్పుడు ఎలాంటి గ్రేడ్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. వర్సిటీకి నిధులు రాకపోవడంతో సిబ్బంది జీతాలకూ ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తిందన్నారు. న్యాక్ గుర్తింపు ఉంటే నిధులెక్కువగా వస్తాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని రేవంత్ విమర్శించారు. వర్సిటీ సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని రేవంత్ చెప్పారు.