లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే!

లీకువీరుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకరే! - Sakshi


అది 2014 సంవత్సరం. మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష పేపర్ లీకైన విషయం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అందులో కీలక నిందితుడు రాజగోపాల రెడ్డి. అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు.



కట్ చేస్తే.. 2016 సంవత్సరం.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీకైందని సీఐడీ నిర్ధారించింది. ఇందులోనూ కీలక నిందితుడు రాజగోపాలరెడ్డే!! అప్పుడూ ఇప్పుడూ కూడా అదే వ్యక్తి మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్లను లీక్ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయం తాజాగా తెలంగాణ సీఐడీ విచారణలో తేలింది.



ఎంసెట్ పేపర్ లీకేజి విషయంలో ఇప్పటివరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో గతంలో నిందితుడైన రాజగోపాలరెడ్డితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారీ రమేష్లతో పాటు.. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో విష్ణుకు ఒక కన్సల్టెన్సీ ఉంది. దాని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజిమెంటు కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకునేవాడని అంటున్నారు. ఈ నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో ఉన్నారని, వాళ్లు పరారీలో ఉన్నారని సమాచారం.



కేసు ఛేదించిందిలా...

సీఐడీ అధికారులు ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. ర్యాంకులు వచ్చిన పిల్లల తల్లిదండ్రుల కాల్ డేటా కూడా చూస్తే రెండూ కలిశాయి. వాళ్లిద్దరు కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. జేఎన్టీయూ సిబ్బంది ఇద్దరి పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలిసింది. లీకేజి స్కాం విలువ 50 కోట్లు, కాగా.. మొత్తం 74 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని చెబుతున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ముఖ్యమం‍త్రి కేసీఆర్కు డీజీపీ అందజేశారు.



లీకు ఎలా చేశారంటే...

బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిచింది. రాజగోపాలరెడ్డి (63) ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజిమెంట్ కోటాలో వైద్యసీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరించేవాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతడిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఢిల్లీలో పేపర్ల ముద్రణ జరుగుతుందని ముందే తెలిసిన రాజగోపాలరెడ్డి.. హైదరాబాద్లో ఉన్న కన్సల్టెన్సీ ద్వారా ఎంబీబీఎస్ కోచింగ్ సెంటర్లలో బాగా స్థితిమంతులైన పిల్లల వివరాలు సేకరించి, వాళ్ల తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి ప్రధానమైన పరీక్షలకు మూడు సెట్ల పేపర్లను సిద్ధం చేస్తారు. ఏ సెట్ను ఉపయోగించేదీ ఆరోజు ఉదయమే ప్రకటిస్తారు. అందుకే మొత్తం మూడు సెట్ల పేపర్లనూ లీక్ చేయించాడు. ఏ సెట్ వచ్చినా వాటిలోని ప్రశ్నలన్నీ తెలుసు కాబట్టి.. సులభంగా ర్యాంకులు సాధించేలా ఆ విద్యార్థులను రెండురోజుల పాటు బెంగళూరులో సిద్ధం చేశారు. సరిగ్గా పరీక్షరోజు ఉదయమే వాళ్లను విమానాల్లో హైదరాబాద్ రప్పించారు. దాంతో ముందు అనుకున్నట్లుగానే మంచి ర్యాంకులు వచ్చాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top