ఉస్మానియా వర్సిటీకి రాహుల్ గాంధీ
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. మే రెండో వారంలో తెలంగాణలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్న ఆయన.. విద్యార్థి సంఘాల ఆహ్వానం మేరకు ఓయూకు వచ్చి ఒక రాత్రంతా అక్కడే గడుపుతారని తెలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలపడంతో భాగంగా విద్యార్థులు రాహుల్ గాంధీని సత్కరించనున్నారు.
కొత్త రాష్ట్రంగా ఏర్పడిన పదకొండు నెలల కాలంలోనే తెలంగాణలో దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరును ఎండగట్టడంతోపాటు రైతులకు మనోస్థైర్యం కల్పించేందుకు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిదే. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సొంత జిల్లా మెదక్ రైతులతో రాహుల్ భేటీకానున్నారు.