కొండచిలువ పట్టివేత
బహదూర్పురా (హైదరాబాద్సిటీ): మీరాలం ఫిల్టర్ ప్రాంతంలో దొరికిన కొండ చిలువను బహదూర్పురా పోలీసులు గురువారం జూపార్కుకు తరలించారు. బహదూర్పురా ఇన్స్పెక్టర్ హరీష్ కౌషిక్ ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. మీరాలం ఫిల్టర్ ఏ-1 ఫంక్షన్కు హాల్ వద్ద కొండ చిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు సర్ధార్ మహ్మద్ ఆదిల్, అరుణ్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అయితే ట్యాంక్ చుట్టు ఉన్న ఇనుప జాలీల కారణంగా కొండచిలువ బయటికి వచ్చేందుకు ప్రయత్నించి అందులో చిక్కుకుపోయింది. దీంతో మహ్మద్ ఆదిల్ జాలీలను వదులు చేసి దానిని పట్టుకున్నాడు. దానిని జూపార్కుకు తరలించారు. కొండ చిలువకు ఎలాంటి గాయాలు లేవని, పొడవు 8 అడుగులు, బరువు దాదాపు 10 కిలోలు ఉన్నట్లు జూపార్కు వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ ఎం.ఎ.హకీం తెలిపారు.