చంద్రబాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు


-అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

-లోకాయుక్తకు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు

-సీఎం తమ పరిధిలోకి రాడని పేర్కొన్న లోకాయుక్త




 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నాడని, ఆయన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఏపీ వెనుకబడిన తరగతుల సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డేరంగుల ఉదయ్‌కిరణ్ శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేశారు.


 


గత రెండేళ్లుగా అక్రమంగా ఆర్జించిన డబ్బుతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేశారని, అయితే చంద్రబాబునాయుడు ప్రజల మనోభావాలకు విర్దుదంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపై చట్టపరమైన దర్యాప్తు చేపట్టి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు చేయాలని పోరాటం చేస్తున్నందుకు తనను చంపాలని చూస్తున్నారని, అలాగే తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాలని తెలిపారు. ప్రజల హక్కులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


కాగా ‘ముఖ్యమంత్రిని విచారించే పరిధి మాకు లేదు. ఇతర రాష్ట్రాల్లో లోకాయుక్త సమర్ధవంతంగా ఉంది. ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రిని విచారించే పరిధి మాకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించండి’ అని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఈ సందర్బంగా సూచించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top