3 నెలలకోసారి ప్రధాని పర్యటన

3 నెలలకోసారి ప్రధాని పర్యటన - Sakshi


- బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్

- ప్రధాని పర్యటన నేపథ్యంలో పార్టీ పదాధికారుల భేటీ

 

 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇక నుంచి మూడు నెలలకోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 7న మోదీ రాష్ట్రానికి మొదటిసారి వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం పదాధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు చింతా సాంబమూర్తి, టి.ఆచారి, జి.ప్రేమేందర్‌రెడ్డిలు సమావేశ వివరాలను మీడియాకు తెలిపారు. మోదీ పర్యటన నేపథ్యంలో కార్యక్రమాలకోసం సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు.



ఈ సందర్భంగా పూర్తిస్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతీ పోలింగ్‌బూత్ నుంచి కనీసం ఐదుగురు కార్యకర్తలు, ఒక మహిళా కార్యకర్త ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రధానితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రతీ మూడు నెలలకొకసారి రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రభాకర్ వెల్లడించారు. అలాగే ఇక నుంచి రాష్ట్రంలో తరచుగా కేంద్రమంత్రుల పర్యట నలు కూడా ఉంటాయని చెప్పారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top