ఫిరాయింపులపై చర్యలు తీసుకోండి


రాష్ట్రపతికి టీపీసీసీ వినతి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీల ఫిరాయింపులు జరుగుతున్నా గవర్నర్, స్పీకర్ పట్టించుకోవడం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి టీపీసీసీ బృందం ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి నిలయంలో విడిది కోసం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతిని టీపీసీసీ అగ్రనేతలు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ నేతృత్వంలో సుమారు 50 మంది నేతలు సోమవారం కలిశారు. టీఆర్‌ఎస్ మంత్రిగా టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారని రాష్ట్రపతికి వివరించారు.



రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన స్పీకరు పట్టించుకోవడం లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గవర్నర్ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ చర్యల వల్ల రాజ్యాంగ సంక్షోభం, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.



తలసానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న గవర్నర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.  రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా 900 మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటే 96 మంది మాత్రమే చేసుకున్నట్టుగా ప్రభుత్వం తప్పుడు లెక్కలను ఇస్తున్నదని పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top