ర్యాష్ డ్రైవింగ్: ప్రముఖ నిర్మాత కొడుకు అరెస్టు
హైదరాబాద్: మితిమీరిన వేగంతో వాహనం నడపుతూ ఇతర వాహనదారులను, పాదచారులను భయబ్రాంతులకు గురి చేసిన సినీ నిర్మాత పరుచూరి ప్రసాద్ తనయుడు కిరీటి(22)పై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ రోడ్ నంబర్-10లో నివసించే పరుచూరి కిరీటి బీటెక్ చదివాడు. హీరో బాలకృష్ణ నటించిన సింహ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
కొద్ది రోజుల నుంచి తన ఫార్చునర్ కారు( ఏపీ 09 సీవీ 2929)లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లపై దూసుకెళ్తూ ఇతరులకు ఇబ్బందికరంగా కలిగిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంపై నాలుగు రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, సీసీ ఫుటేజీల ఆధారంగా కిరీటీ ర్యాష్ డ్రైవింగ్ ను గుర్తించారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ చౌరస్తాలో పోలీసులు నిఘా వేసి మితిమీరిన వేగంతో దూసుకొస్తున్న వాహనాన్ని ఆపి కిరీటిని అరెస్టు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.