టీఎస్పీఎస్సీలో పర్సనాలిటీ కౌన్సిలర్లు
యూపీఎస్సీ తరహాలో ఇంటర్వ్యూ బోర్డుల్లో చోటు కల్పిస్తూ చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, హావభావాలు, ప్రవర్తనాశైలి తదితర అంశాలను అంచనా వేసేందుకు ఇంటర్వ్యూ బోర్డుల్లో పర్సనాలిటీ కౌన్సిలర్లకు స్థానం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఇంటర్వ్యూల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని టీఎస్పీఎస్సీ వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీఆర్టీ)లో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. మొత్తంగా నాలుగు బోర్డుల నేతృత్వంలో ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఒక్కో బోర్డులో ఇద్దరు కమిషన్ సభ్యులు, ఒక సబ్జెక్టు నిఫుణుడు, ఆయా శాఖల ప్రతినిధి, ఒక పర్సనాలిటీ కౌన్సిలర్ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు నిత్యం దాదాపు 120 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది.