నయీమ్‌ను పెంచి పోషించింది గత పాలకులే : పల్లా రాజేశ్వర్‌రెడ్డి


* రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఆరోపణలు

* టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ధ్వజం


సాక్షి, హైదరాబాద్: నయీమ్ అనే క్రూర మృగాన్ని పెంచి పోషించింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నయీమ్ నేర సామ్రాజ్యానికి టీడీపీ విత్తనం నాటి, అంకురార్పణ చేయగా, కాంగ్రెస్ నీళ్లు పోసి సంరక్షించిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి నయీమ్ ఆగడాలను అరికట్టలేకపోయిన రాజగోపాల్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులు.. ఉద్యమాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.



దళిత ఎమ్మెల్యేలపై అనవసర ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ డిమాండ్ చేశారు. తనపై, మరో ఎమ్మెల్యే వేముల వీరేశంపై చేసిన తప్పుడు ఆరోపణలపై చర్చకు సిద్ధం కావాలని, ఆధారాలు ఉంటే నిరూపించాలన్నారు. ఇపుడు నీతులు చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి గతంలో నయీమ్ సాంబశివుడిని హత్య చేసినప్పుడు ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top