కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కన్నుమూత
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పుంజల. శివశంకర్ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ లోని స్వగృహంలో మృతి చెందారు. కేంద్రమంత్రిగా, కేరళ మరియు సిక్కిం రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన శివశంకర్ ఆగస్టు 10, 1929న హైదరాబాదులో జన్మించారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి లోకసభకు, రాజ్యసభకు ఎన్నిక కావడమే కాకుండా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాలలో స్థానం పొందారు. కేరళ, సిక్కిం రాష్ట్రాల గవర్నరుగా కూడా పనిచేశారు.
న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన శివశంకర్ తొలిసారి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా, రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. అలాగే ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వయోభారం వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కాగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అవిరళం కృషిచేసిన శివశంకర్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శివ శంకర్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, తదితరులు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అభిమానుల సందర్శనార్థం శివశంకర్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 59లోని స్వగృహంలో ఉంచారు.
మరిన్ని వార్తలు