యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారానే కార్యకలాపాలు


డెక్కన్‌ క్రానికల్‌కు డీఆర్‌టీ ఆదేశం

 

సాక్షి, హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) సంస్థ ఆర్థిక వ్యవహారాలు, ప్రకటనలు, సర్క్యులేషన్‌ ద్వారా వచ్చే ఆదాయ, వ్యయాలన్నీ యాక్సిస్‌ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలని డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) డీసీహెచ్‌ఎల్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే డీసీహెచ్‌ఎల్‌ ఇతర బ్యాంకుల్లో నిర్వహిస్తున్న కరెంటు ఖాతాల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రవీణరెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. తమ బ్యాంకు నుంచి డీసీహెచ్‌ఎల్‌ తీసుకున్న రూ.430 కోట్ల రుణం వసూలు కోసం యాక్సిస్‌ బ్యాంకు గతంలో డీఆర్‌టీని ఆశ్రయించింది.



ఇందులో భాగంగా డీసీహెచ్‌ఎల్‌ ఆర్థిక కార్యకలాపాలన్నీ తమ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ ఇటీవల మరో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. అప్పులేని బ్యాంకుల ద్వారానే ఆదాయ, వ్యయాల ఖాతాలను డీసీహెచ్‌ఎల్‌ నిర్వహిస్తోందని, అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లోనే ఆదాయ, వ్యయాల ఖాతాలు నిర్వహించాల్సి ఉందని యాక్సిస్‌ బ్యాంకు డీఆర్‌టీకి నివేదించింది. ఈనెల 19న ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో డీసీహెచ్‌ఎల్‌ కౌంటర్‌ దాఖలు చేయకపోగా, ఆ సంస్థ తరఫున న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీచేస్తూ ప్రధాన పిటిషన్‌పై విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.  
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top