‘డబుల్ బెడ్రూం’కు డబ్బులేవీ?
అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకానికి నిధుల కొరత ఏర్పడింది. దీంతో వేరే అవసరాలకు ఉద్దేశించిన నిధులను దీనికి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం 50 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ఇదివరకే ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా ఇటుక పడలేదు. మహబూబ్నగర్, వరంగల్ పట్టణాలకు కొన్ని ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా పనులు మొదలుకాలేదు. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నందున అవసరమైతే వేరే పద్దుల నిధులను వినియోగించయినా సరే ఇళ్లు చేపట్టాలని సోమవారం సీఎం కేసీఆర్ అధికారులను ఆదే శించారు.
ఈ మేరకు సీఎం గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఇతర విభాగాల ముఖ్యకార్యదర్శులు ఎంజీ గోపాల్, ప్రదీప్చంద్ర, బీఆర్ మీనా, దానకిశోర్, రామకృష్ణారావు, శాంతికుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, స్మితా సభర్వాల్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించాలని, హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ద్వారా వచ్చిన నిధులను కూడా ఇందుకు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించిన విషయం తెలిసిందే.