ఈ బడ్జెట్‌కు విలువే లేదు: సోమయాజులు

ఈ బడ్జెట్‌కు విలువే లేదు: సోమయాజులు - Sakshi


సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక పనికిరాని డాక్యుమెంట్ అని, దానికి ఏమాత్రం విలువే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు వ్యాఖ్యానించారు. గత ఏడాది వాస్తవిక లెక్కల వివరాలుగానీ, వచ్చే కొద్ది నెలల కాలానికి అంచనా వివరాలుగానీ ఈ బడ్జెట్‌లో ఇవ్వలేకపోయారని చెప్పారు. కనీసం గత నాలుగు నెలల వాస్తవిక రాబడి వివరాలనైనా వెల్లడించలేదని అన్నారు. అతి ముఖ్యమైన రెవెన్యూ రాబడుల్లో పన్నుల రూపేణా వచ్చేది ఎంత, పన్నేతర వనరుల నుంచి వచ్చేది ఎంత అనే విషయాలేమీ బడ్జెట్‌లో వెల్లడించలేదన్నారు.

 

ప్రణాళిక వ్యయం, పెట్టుబడి వ్యయం కేటాయింపులు సమృద్ధిగా ఉంటే ఆ బడ్జెట్ బాగున్నట్లేనని, కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ రెండు కేటాయింపులూ తక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రం విడిపోయాక అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, వాహనాల పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయమెంతో తెలియజేయలేదన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల 2, 3, 4 సంవత్సరాల ఫీజు రీయింబర్స్‌మెంట్ కేటాయింపులు కూడా ఈసారి బడ్జెట్‌లో లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

 

కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎరుుడ్ వస్తుందనడం అసంబద్ధం

కేంద్రం నుంచి రూ. 29 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని బడ్జెట్‌లో చెప్పడం అసంబద్ధంగా ఉందన్నారు. ప్రణాళిక వ్యయం ఎంత పెరిగితే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంత పెరుగుతుందన్నారు. అరుుతే, ఈ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయూన్ని 24 శాతానికే పరిమితం చేశారని, ఇప్పుడు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎలా పెరుగుతుందో కూడా చెప్పడం కష్టమని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం నుంచి రూ. 14,500 కోట్లు రావడానికి అవకాశముందని, ఒకవేళ ఆ నిధులు రాకుంటే తాము వేస్తున్న ఈ అంచనాలన్నీ తారుమారవుతాయని పేర్కొన్నారని వివరించారు. అలా జరిగితే రూ. 6 వేల కోట్ల రెవెన్యూ లోటు రూ. 25 వేల కోట్లకు, రూ. 12 వేల కోట్ల ద్రవ్య లోటు రూ. 35 వేల కోట్లకు పెరుగుతుందని చెప్పారు. అప్పుడు పరిస్థితి భయానకంగా ఉంటుందన్నారు.లోటు పూడ్చడంపైనా ఆర్డినెన్స్ ఇవ్వాల్సింది.

 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారని, అరుుతే తొలి ఏడాది ఆ లోటును కేంద్రం ఎలా భర్తీ చేస్తుందో అందులో పేర్కొనలేదని సోమయాజులు తెలిపారు. ఈ హామీ అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రసంగంలో మాత్రమే ఉందని, చట్టంలో చేర్చలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగానే కేంద్రం దీనిపైన కూడా ఆర్డినెన్స్ ఇచ్చి ఉంటే చట్టబద్ధత ఉండేదన్నారు. అందువల్ల ఆర్థిక లోటును కేంద్రం పూడుస్తుందో లేదో తెలియకుండా ఉందన్నారు. రాజధాని ఎక్కడో నిర్ధారణ కాకుండానే 5 లక్షల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మిస్తామని చెప్పడం కూడా మోసపూరితమేనన్నారు. రాజధాని ఎక్కడో తేల్చకుండా దానిని ఎలా కట్టాలో అధ్యయనం చేయడానికి మంత్రులు విదేశాలకు వెళ్లడం దండగని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top