నిషిత్‌ కేసు:బెంజ్‌ ప్రతినిధుల వితండ వాదన






హైదరాబాద్‌: బెంజ్‌ కంపెనీ ప్రతినిధుల వితండ వాదనపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెల 10వ తేదీన తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లో బెంజ్‌కారు నడుపుతూ మితిమీరిన వేగంతో వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కేడ మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ నారాయణ ఘటనలో బెంజ్‌ కంపెనీ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదు.


అయితే దీనిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారం క్రితం బెంజ్‌ ప్రతినిధులకు రిపోర్ట్‌ ఇవ్వాల్సిందిగా మెయిల్‌ పంపారు. ఇందుకు స్పందించిన పూణేలోని బెంజ్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం జూబ్లీహిల్స్‌ పోలీసులకు తిరుగు సమాధానం ఇస్తూ నిశిత్‌ నారాయణ పోస్టుమార్టం నివేదికలతో పాటు అక్కడి సీసీ పుటేజీలు, పిల్లర్‌ వద్ద నుంచి కారును తొలగించినప్పుడు ఏమైనా వీడియో తీశారా? తదితర వివరాలు ఇస్తేనే తాము నివేదిక ఇస్తామంటూ వెల్లడించారు.


నిషిత్‌ నారాయణ కారు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్‌ పోలీసులు బెంజ్‌ కంపెనీకి లేఖ రాస్తూ సీటు బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్‌ అవుతాయా, పెట్టుకోకున్నా ఓపెన్‌ అవుతాయా అన్న వివరాలతో పాటు ఎంత స్పీడ్‌లో వెళ్తే మృతి చెందే అవకాశాలున్నాయో చెప్పాలంటూ కోరగా గత నెల 16వ తేదీన బెంజ్‌ ప్రతినిధులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. కారును కూడా పరిశీలించారు. అయితే ఇప్పటివరకూ నివేదిక మాత్రం ఇవ్వలేదు.  కాగా ఈ రోడ్డు ప్రమాదంలో నిషిత్‌తో పాటు అతడి స్నేహితుడు  రాజా రవిచంద్ర వర్మ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.



Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top