రిమ్స్కు కొత్త గైనిక్ యూనిట్లు
- మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలోనూ ఓ యూనిట్
- పాలక మండళ్ల సమావేశాల్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ రిమ్స్లో మరిన్ని గైనిక్ యూనిట్లు నెలకొల్పాలని, అక్కడ జరుగుతున్న వైద్య సేవల దృష్ట్యా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రిమ్స్ పాలకమండలి నిర్ణయించింది. మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో భవన నిర్మాణ పనుల వేగం పెంచడంతోపాటు గైనిక్ యూనిట్ ఏర్పాటు చేయాలని, ఆ కాలేజీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్యశ్రీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మూడు పాలకమండళ్ల సమావేశాలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో శనివారం వేర్వేరుగా జరిగాయి. మూడు సమావేశాలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నేతృత్వం వహించారు. రిమ్స్ సమావేశానికి అటవీ మంత్రి జోగురామన్న కూడా హాజరయ్యారు.
మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి స్త్రీ సంబంధ, ప్రసవాల రిఫరల్స్ ఎక్కువగా నగరానికి వస్తున్నాయని, వాటిని తగ్గించడానికి వీలుగా అక్కడ ఓ గైనిక్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఆరోగ్యశ్రీ సేవలు, వాటికి అవుతున్న వ్యయంపై పాలక మండలి సమావేశంలో సమీక్ష జరిగింది. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రతి పాత జిల్లా కేంద్రంలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని.. సాధ్యమైనంత వేగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లో ఈ సెంటర్లు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, రిమ్స్ డైరెక్టర్ అశోక్, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్, ఉద్యోగ, జర్నలిస్టుల ఆరోగ్య పథకం సీఈవో పద్మ సమావేశాల్లో పాల్గొన్నారు.