అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో తుదితీర్పు

అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో తుదితీర్పు - Sakshi


హైదరాబాద్‌ : మజ్లిస్‌ పార్టీ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం కేసులో కోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురిని (సలీం బిన్‌, అబ్దుల్లా, అవద్‌, హసన్‌ బిన్‌) నాంపల్లిలోని 7వ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌పై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. పహిల్వాన్‌ సహా పదిమంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. 2011 ఏప్రిల్‌ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.



ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్రగాయాలు కాగా... ఆయన గన్‌మెన్‌ జరిపిన కాల్పుల్లో ఇబ్రాహిం అనే యువకుడు మరణించాడు.  ఈ కేసులో 13మంది నిందుతులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు  19మంది సాక్షులను విచారించింది నాంపల్లి కోర్టు. అక్బరుద్దీన్ స్టేట్ మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ తుది తీర్పు నేపథ్యంలో... అటు పహిల్వాన్ గ్యాంగ్, ఇటు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కోర్టుకు వచ్చారు. దీంతో పోలీసులు పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top