జీవితకాలం పూర్తయితే.. చార్మినార్నైనా కూలగొట్టాల్సిందే!
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
హన్మకొండ అర్బన్: నిర్మాణం యొక్క జీవితకాలం పూర్తయి, శిథిలావస్థకు చేరి, ప్రజలకు ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజాభీష్టం మేరకు చార్మినార్ వంటి నిర్మాణమైనా కూల గొట్టి కొత్త కట్టడం నిర్మించాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నా రు. శనివారం కాజీపేటలోని ఎన్ఐటీ సమీపంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, కలెక్టరేట్ను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ప్రదేశంలో ఆధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో 20 అంతస్తుల నూతన భవనం నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
పురాతన భవనాలను వందల కోట్లు వెచ్చించి 10 సంవత్సరాల వయసు పెంచడంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. అందువల్ల పురాతన భవనాల స్థానంలో పూర్తిగా కొత్తభవనాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. నూతన భవనం ఉస్మానియా ఆస్పత్రి పేరు మీదనే నిర్మితమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రోగులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ముస్లింలు, గిరిజనులకు 12%రిజర్వేషన్లు
సుధీర్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లిం, మైనారిటీలు, గిరిజనులకు చెందాల్సిన 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ ఏడాదిలోని బిల్లును తెస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హన్మకొండలో శనివారం జరిగిన ‘ఈద్ మిలాప్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడారు.
సంబంధిత వార్తలు