‘పెడన’ వైఎస్సార్ సీపీ కైవసం

‘పెడన’ వైఎస్సార్ సీపీ కైవసం - Sakshi


మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పదవులు వైఎస్సార్‌సీపీకే

పెడన టౌన్(చిలకలపూడి): కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ బండారు ఆనందప్రసాద్ మున్సిపల్ చైర్మన్‌గా, ఎంపీటీసీ సభ్యుడు రాజులపాటి అచ్యుతరావు ఎంపీపీగా ఎన్నికయ్యారు. సాధారణ ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు టీడీపీ దక్కించుకుంది. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న యర్రా శేషగిరిరావు మృతి చెందడం, ఎంపీపీగా ఉన్న ముచ్చు నాగేశ్వరమ్మ అనర్హతకు గురికావడంతో ఈ స్థానాలకు ఖాళీ ఏర్పడింది.



దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి ప్రసాద్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి బండారు ఆనందప్రసాద్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక పెడన మండల పరిషత్‌కు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజులపాటి అచ్యుతరావును అధ్యక్షునిగా ఎన్నిక చేస్తూ ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా, గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో ఓటుతో మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. అలాగే మండల పరిషత్‌కు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని తన వైపునకు లాక్కొని ఎంపీపీ పదవి చేజిక్కించుకుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top